బీజేపీకి మరో ఇబ్బంది: సొంత పార్టీ నేత కూతురు సీజేపీకి మద్ధతు
Indiabreakingdaily.com – క క ర చ జనత ప ర – కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఆందోళనలకు వ్యతిరేకంగా బీజేపీ చేస్తున్న ప్రయత్నాలకు మరో అడ్డంకి ఎదురైంది. పార్టీ నేతల కుటుంబాల నుంచే వ్యతిరేకత వస్తుండటంతో బీజేపీ ఇబ్బందుల్లో పడింది. నీట్ వ్యతిరేక నిరసనల్లో ఎన్డీఏ నేత కూతురు పాల్గొన్న విషయం మరిచిపోక ముందే, మరో బీజేపీ నేత కూతురు సీజేపీకి మద్ధతు తెలియజేస్తూ వీడియో విడుదల చేయడం చర్చనీయాంశమైంది.
యశస్వినీ రాజే సింగ్ వీడియో వైరల్
ఉత్తరప్రదేశ్లోని ఫతేపూర్కు చెందిన బీజేపీ మాజీ ఎమ్మెల్యే విక్రమ్ సింగ్ కుమార్తె యశస్వినీ రాజే సింగ్ సీజేపీకి మద్ధతు తెలియజేస్తూ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఢిల్లీ జంతర్ మంతర్లో జరిగిన సీజేపీ నిరసనలో ఆమె పాల్గొన్నారు. అల్ జజీరా ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో విద్యాశాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషీ నియామకాన్ని పెద్ద జోక్ అని విమర్శించారు.
నీట్ పేపర్ లీక్ విషయంలో రాజీనామా చేయాల్సి వచ్చిందని పశ్చాత్తాపపడకుండా.. ఒక అమరవీరుడు రాజీనామాలా ఉందని ఆమె విమర్శించారు.
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై కూడా ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశ వ్యతిరేక శక్తులు పరిస్థితిని తమ చేతుల్లోకి తీసుకోకుండా ఉండేందుకే తాను ఈ నిర్ణయం తీసుకున్నానని రాజీనామా లేఖలో పేర్కొనడంపై తీవ్రంగా విమర్శించారు.
సీజేపీ ఆందోళనల చరిత్ర
నీట్ పేపర్ లీక్ వివాదంపై ప్రధాన్ రాజీనామా డిమాండ్తో జంతర్ మంతర్ దగ్గర మొదలైన ఆందోళనలు, ఆయన రాజీనామాతో 36 రోజుల తర్వాత ముగిశాయి. ప్రారంభంలోనే దేశవ్యాప్తంగా ఇతర నగరాలకు కూడా వ్యాపించాయి. ఈ నిరసనల్లో జెన్-జెడ్ విద్యార్థులు పోలీసు బలగాలతో జరిగిన ఘర్షణ ప్రపంచ దృష్టిని ఆకర్షించింది.
యశస్వినీ ఇన్స్టాగ్రామ్ మెసేజెస్, మీమ్స్తో రాజకీయాలకు అతీతంగా ఉండే జెన్ జెడ్ ప్రేక్షకులను స్పందించేలా చేయడంలో సీజేపీ గొప్ప పని చేశారని అన్నారు. తన తండ్రితో రాజకీయాల గురించి మాట్లాడనని చెప్పింది. తాను ఫినాన్షియల్ గా ఇండిపెండెంట్ అని, సొంతంగా జీవిస్తున్నానని, చాలా సంవత్సరాలుగా ఫతేపూర్ సదర్కు వెళ్లలేదని ఆమె చెప్పారు.
ఇతర బీజేపీ నేత కూతుర్ల మద్ధతు
అంతకుముందు, బీజేపీ ఎంపీ అపరాజిత సారంగి కుమార్తె అర్చిత సచిన్ రాహర్, ప్రధాన్ రాజీనామాను ఓపెన్ గా స్వాగతించి చర్చకు తెరలేపిన విషయం తెలిసిందే. నా కుటుంబం ధర్మేంద్ర ప్రధాన్ తో ఉంది, కానీ నేను విద్యార్థులతో ఉన్నాను అనే క్యాప్షన్తో ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసిన స్టోరీ వైరల్ అయిన విషయం తెలిసిందే. దీంతో ధర్మేంద్ర ప్రధాన్ అనుచరులు ఆ ఎంపీని సంప్రదించి, ఆ పోస్ట్ను తొలగించమని కోరినట్లు వార్తలొచ్చాయి.
మరో బీజేపీ నాయకుడు అస్సాం రెవెన్యూ మంత్రి కేశబ్ మహంత కూతురు కూడా సీజేపీకి మద్ధతు ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రధాన్ రాజీనామాను డిమాండ్ చేస్తూ, చేతుల్లో ప్లకార్డులు పట్టుకుని నిరసనకారులతో కలిసి దిబిసా మహంత ర్యాలీలో పాల్గొన్న వీడియోలు సోషల్ మీడియాలో షేర్ అయ్యాయి. దీనిపై స్పందించిన అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ, పిల్లలు పెద్దయ్యాక వారు చేసే పనులను తల్లిదండ్రులతో ముడిపెట్టకూడదని, ట్రోల్ చేయవద్దని ప్రజలను కోరడం చర్చనీయాంశంగా మారింది.




